కడప జిల్లా వేంపల్లిలో జరుగుతున్న ఇంటర్మీడియట్ రెగ్యులర్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జరుగుతోందని, దీనిని అరికట్టాలని అఖిల భారత విద్యార్థి బ్లాక్ (ఏఐఎస్బీ) రాష్ట్ర అధ్యక్షుడు సగిలి రాజేంద్రప్రసాద్ డిమాండ్ చేశారు.
వేంపల్లి ప్రాంతంలోని కొన్ని ప్రైవేట్ జూనియర్ కళాశాల యాజమాన్యాలు పరీక్షా కేంద్రాల సిబ్బందితో కుమ్మక్కై మాస్ కాపీయింగ్ కు పాల్పడుతున్నాయని, వేంపల్లి ఉర్దూ కళాశాలలో జరుగుతున్న ఈ వ్యవహారంలో కొందరు అధికారుల సహకారం కూడా ఉందని ఆయన ఆరోపించారు.
పరీక్షలను సజావుగా నిర్వహిస్తున్న భాస్కర్ నాయక్ ను విధుల నుండి ఎందుకు తొలగించారో ఉన్నతాధికారులు వివరణ ఇవ్వాలని రాజేంద్రప్రసాద్ కోరారు. అధికార పార్టీ నేతకు చెందిన కళాశాలలో ఒక్కో విద్యార్థి వద్ద నుంచి రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నారని తమకు ఫిర్యాదులు అందాయని ఆయన తెలిపారు.
సోమవారం, మంగళవారం జరిగే పరీక్షల్లోనూ భారీగా మాస్ కాపీయింగ్ నిర్వహించేందుకు ప్రైవేట్ కళాశాలలు సిద్ధమవుతున్నాయని, ఇది నిజాయితీగా చదివే విద్యార్థులకు తీవ్ర అన్యాయం చేస్తుందని ఆయన అన్నారు.
జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులు, జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి వేంపల్లి ఉర్దూ కళాశాల పరీక్ష కేంద్రంలో మాస్ కాపీయింగ్ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ఆందోళన చేపడతామని రాజేంద్రప్రసాద్ హెచ్చరించారు.


