ఏలూరు ప్రభుత్వ బోధనాసుపత్రిలో మెరుగైన సౌకర్యాలు కల్పించి, ఆసుపత్రి అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరించేందుకు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఆసుపత్రి రివ్యూ మీటింగ్ లో ఆయన పలు కీలక సూచనలు చేశారు.
ఏలూరు కలెక్టరేట్ లోని గౌతమి సమావేశ మందిరంలో శనివారం జరిగిన సమీక్షా సమావేశంలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్, ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య, కలెక్టర్ వెట్రి సెల్వి పాల్గొన్నారు. ఆసుపత్రిలోని ప్రస్తుత పరిస్థితులపై ఎంపీ అసంతృప్తి వ్యక్తం చేశారు. వైద్య సిబ్బంది ఖాళీలను వేగంగా భర్తీ చేయాలని, రోగులను ఇతర ఆసుపత్రులకు పంపించే పరిస్థితి మారాలని, మందుల సరఫరా, పారిశుధ్యం మెరుగుపరచాలని సూచించారు.
ఏలూరు, జంగారెడ్డిగూడెం, కైకలూరు ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఎంపీ తెలిపారు. వైద్య సిబ్బంది ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని DME ను ఆదేశించారు. నిబంధనల ప్రకారం నియామకాలు చేపట్టాల్సి ఉన్నప్పటికీ, తాత్కాలిక ప్రాతిపదికన అత్యవసర నియామకాలకు చర్యలు తీసుకుంటామని DME హామీ ఇచ్చారు.
CSR నిధుల ద్వారా మరో 50 లక్షల రూపాయలు ఆసుపత్రి సౌకర్యాల కల్పనకు సమకూర్చేందుకు ఎంపీ హామీ ఇచ్చారు. ఈ నిధులను టాయిలెట్స్, దోమతెరలు వంటి వాటికి వినియోగించాలని ఆదేశించారు. ఇప్పటికే ఒక అంబులెన్స్ అందించామని, మరో అంబులెన్స్ త్వరలో అందిస్తామని తెలిపారు.
ఆసుపత్రి సూపరింటెండెంట్ పలు సమస్యలపై వివరణ ఇచ్చారు. గుండె సంబంధిత రోగుల వైద్యానికి క్యాథలాబ్ ఏర్పాటు చేస్తే మరణాల సంఖ్యను తగ్గించవచ్చని, దీనికి అవసరమైన నిధుల కోసం ప్రభుత్వంతో మాట్లాడుతానని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. ఆసుపత్రి అభివృద్ధిపై సమగ్ర నివేదిక తయారు చేయాలని DME, సూపరింటెండెంట్ ను ఆదేశించారు.

