ఒంగోలు, ఆగస్టు 4, 2026
గోగుల గురవయ్య అనే దళిత రియల్ ఎస్టేట్ వ్యాపారిపై జరిగిన కిడ్నాప్, దాడి ఘటనలో అప్పటి ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ ఎస్సై ఫణిభూషణ్తో పాటు ఇతర నిందితులను వెంటనే అరెస్టు చేయాలని దళిత హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు నీలం నాగేంద్రరావు డిమాండ్ చేశారు.
గోగుల గురవయ్యపై జరిగిన కిడ్నాప్, దాడి ఘటనకు సంబంధించి అప్పటి ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ ఎస్సై ఫణిభూషణ్తో పాటు కేసులో ఉన్న ఇతర నిందితులను వెంటనే అరెస్టు చేయాలని దళిత హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు నీలం నాగేంద్రరావు డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక దళిత హక్కుల పరిరక్షణ సమితి కార్యాలయం వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన ఈ మేరకు మాట్లాడారు.
గోగుల గురవయ్య అనే దళిత రియల్ ఎస్టేట్ వ్యాపారిని గత జూన్ 11న డబ్బుల లావాదేవీ వివాదం పేరుతో పోలీస్ స్టేషన్కు పిలిపించారని, అనంతరం అర్సపల్లి శ్రీనివాసరావు, ఆంజనేయులు అనే వ్యక్తులకు అప్పగించడంతో వారు కారులో మంగమూరు రోడ్డు వైపు తీసుకెళ్లి తీవ్రంగా దాడి చేశారని ఆరోపించారు. ఈ ఘటనలో అప్పటి ఎస్సై ఫణిభూషణ్, కానిస్టేబుల్ మాకినేని కిషోర్ పాత్ర కూడా ఉందని ఆయన పేర్కొన్నారు.
దాడి అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గురవయ్య వాంగ్మూలంలో కొంతమంది పోలీసు అధికారుల పేర్లు ఉన్నప్పటికీ, వాటిని తొలగించి సంతకం తీసుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ విషయమై బాధితుడు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయగా, కేసు ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద నమోదు అయిందని తెలిపారు.
మొదట విచారణను ఒంగోలు డీఎస్పీకి అప్పగించినప్పటికీ, బాధితుడి అభ్యర్థన మేరకు ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు విచారణ అధికారిగా దర్శి డీఎస్పీ బాలమురళీకృష్ణను నియమించారు. దర్శి డీఎస్పీ సాక్షులను విచారించినప్పటికీ, ఇప్పటివరకు నిందితులపై చర్యలు తీసుకోకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.
రాజకీయ ఒత్తిళ్ల కారణంగా విచారణ ఆలస్యం అవుతోందని ఆరోపించిన నీలం నాగేంద్రరావు, మాజీ ఎస్సై ఫణిభూషణ్, కానిస్టేబుల్ మాకినేని కిషోర్తో పాటు అర్సపల్లి శ్రీనివాసరావు, ఆంజనేయులను వెంటనే అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు దారా అంజయ్య, కార్యదర్శి కాకుమాను రవి, మాదిగ పరిరక్షణ సమితి కన్వీనర్ పట్రా బంగారం, మేడికొండ మురళి తదితరులు పాల్గొన్నారు.












